నాలాల కబ్జా వల్ల వరద సమయంలో ప్రమాదాలు జరుగుతున్నాయి: హైడ్రా కమిషనర్

  • భారీ వర్షం నేపథ్యంలో అఫ్జల్ సాగర్‌లో ఇద్దరు గల్లంతు
  • నాలాల కబ్జాల వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయన్న హైడ్రా కమిషనర్
  • అఫ్జల్ సాగర్ వద్ద కొన్ని ఇళ్ల తొలగింపుకు నిర్ణయం తీసుకున్నామన్న రంగనాథ్
భాగ్యనగరంలో నాలాల ఆక్రమణల కారణంగా వరదలు సంభవించి ప్రమాదాలు జరుగుతున్నాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ఆదివారం రాత్రి అఫ్జల్ సాగర్‌లో ఇద్దరు వ్యక్తులు గల్లంతైనట్లు ఆయన వెల్లడించారు. నాలాల ఆక్రమణల వల్లే ఇటువంటి దుర్ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

అక్రమ నిర్మాణాల కారణంగా అఫ్జల్ సాగర్ ప్రాంతంలో కొన్ని ఇళ్లను తొలగించాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. నిన్న ముగ్గురు గల్లంతవ్వగా, అందులో ఇద్దరు మరణించినట్లు ఆయన పేర్కొన్నారు. నగరంలోని సమస్యల పరిష్కారానికి హైడ్రా సంస్థ నిరంతరం కృషి చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.

స్పందించిన కలెక్టర్

అఫ్జల్ సాగర్ డ్రైనేజీలో ఇద్దరు గల్లంతైన ఘటనకు సంబంధించి, బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల నష్టపరిహారాన్ని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన ప్రకటించారు. పాత ఇళ్లలో నివసించేవారు జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించారు. కొన్ని నాలాలపై నిర్మాణాలు ఉన్నాయని, వాటి వల్ల అందరికీ ప్రమాదమని ఆమె హెచ్చరించారు. అఫ్జల్ సాగర్ పరిధిలో నివసిస్తున్న అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు.

Ranganath HYDRA
HYDRA Commissioner
Hyderabad Floods
Afzal Sagar
Drainage Encroachments

More Telugu News